
తన జీవితాశయం నిర్మాతగా తన నూరవ చిత్రం "శ్రీవల్లి కళ్యాణం" నిర్మించడమే అని భీమవరం టాకీస్ అధినేత, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోందని తెలిపారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టి.. వచ్చే ఏడాది విడుదల చేస్తామన్నారు. సెప్టెంబర్ 10న తుమ్మలపల్లి రామసత్యనారాయణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
"2004లో సుమన్–రవళి జంటగా రూపొందిన "ఎస్.పీ.సింహా"తో నిర్మాతగా తన కెరీర్ చిన్నగా మొదలై... రామ్ గోపాల్ వర్మ "ఐస్ క్రీమ్ పార్ట్ 1, ఐస్ క్రీమ్ పార్ట్ 2"లతో పుంజుకుందని తుమ్మలపల్లి అన్నారు. సూర్య "ట్రాఫిక్", అజిత్–తమన్నా "వీరుడొక్కడే, కిచ్చా సుదీప్–జగపతిబాబు "బచ్చన్", ఉదయనిధి స్టాలిన్–నయనతార "శీనుగాడి లవ్ స్టోరీ" తదితర అనువాద చిత్రాలు లాభాలతోపాటు ఆత్మ సంతృప్తినీ ఇచ్చాయన్నారు. ఈ ఏడాది యండమూరి దర్శకత్వంలో సునీల్–బిగ్ బాస్ కౌశల్ తో నిర్మించిన "అతడు ఆమె ప్రియుడు" విడుదలైందని ఆయన తెలిపారు.
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో విడుదలైన "జాతీయరహదారి" చిత్రానికి అనేక అవార్డులు వచ్చాయని రామసత్యనారాయణ చెప్పుకొచ్చారు. యండమూరి కథతో ఆర్జీవీ డైరెక్షన్ లో "తులసి తీర్థం" సినిమా త్వరలో మొదలు కానుందన్నారు. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్... దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో "శ్రీవల్లి కళ్యాణం" మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని రామసత్యనారాయణ అన్నారు!