న్యూఢిల్లీ: నిజాయితీ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గకుండా, అన్యాయాన్ని ఎదిరించే తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. 'తోబుట్టువుల దినోత్సవం' సందర్భంగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆమె ఆప్యాయతతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
"ఎంతమంది బురద చల్లినా మంచితనం, కరుణ కోసం నిలబడే ధైర్యం ఉన్న నా ఏకైక తోబుట్టువు. తనను ఒంటరిని చేసినా, వెన్నులో కత్తులు దింపినా, తన నోరు మూయించేందుకు ఎన్ని శక్తులు ప్రయోగించినా నిజం మాట్లాడడానికి వెనుకడుగు వేయని ఉత్తముడు.. నా సోదరుడిని చూసి ఎల్లప్పుడూ గర్వపడుతూ ఉంటాను" అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్కు భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్లో తామిద్దరూ కలిసి నడిచిన ఫొటోను ఆమె యాడ్ చేశారు.