కరీంనగర్ : కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇచ్చి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. చాలా మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోతున్నారని..ఎంజీఎంలో శోభారాణి అనే డాక్టర్ కే బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆరోగ్య భద్రత, ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. వైద్యం విషయంలో ఎందుకు ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 50 వేల మందిని నియమిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా .. వారు ఎందుకు రావడం లేదో అర్థం చేసుకోవాలన్నారు.
ఉన్న సిబ్బందినే కాపాడుకోవడం లేదు. కాబట్టే కొత్తవాళ్లు రావడం లేదని..రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు అందరూ రాజకీయాలకతీతంగా కట్టుబడి ఉండాలన్నారు. ప్రజలను కాపాడాలనే రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిర్ణయానికి కేంద్రం కూడా సహకరిస్తుందని తెలిపారు. ప్రజలకు, కోవిడ్ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. పాజిటివ్ లెక్కలు, మరణాల లెక్కలు, కరోనా నివేదికలో తప్పులు ఇవ్వొద్దన్నారు. ఇలా చేస్తే ప్రజలు కరోనా లేదనుకుని స్వేచ్ఛగా తిరిగే ప్రమాదముందని చెప్పారు.
వాస్తవ నివేదికలిస్తేనే ప్రజలు జాగ్రత్తగా ఉంటారన్న బండి సంజయ్.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడే వారికి ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. డాక్టర్లు, పారామెడికల్, పోలీసులు కరోనా కట్టడిలో పనిచేస్తున్నారని.. 2020 డిసెంబరులో రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. అందులో ఒకటి కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారని.. ఆక్సిజన్, రెమిడిసివర్ మందుల కొరత రాకుండా కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి పేషెంట్లకు సమస్యలు రాకుండా చూడాలని డాక్టర్లకు సూచించామని తెలిపారు బండి సంజయ్. ప్రజలు కూడా లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని.. కోవిడ్ వస్తే భయపడకుండా ధైర్యంగా వైద్యులను సంప్రదించాలన్నారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని.. కొంత మంది ప్రయివేటు ఆస్పత్రుల యజమానులు దురాశతో వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా కష్ట సమయంలో అలాంటి వారి తీరు మారాలని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందని.. వారికి కూడా ప్రభుత్వం సమీక్ష చేసి సహకరించాలన్నారు. 440 టన్నుల ఆక్సిజన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. బల్లారీ నుంచి కేటాయించామన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కేంద్రం నుంచి ఏది కావాలన్నా తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు బండి సంజయ్.