ఉపాధి హామీ పనులు తెగ చేస్తున్రు!

ఉపాధి హామీ పనులు తెగ చేస్తున్రు!
  • గత మూడున్నర నెలల్లోనే స్కీమ్‌‌ కింద రూ. రూ. 41,187 కోట్లు ఖర్చు
  • పనులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ప్రజలకు పని కల్పించేందుకు  ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం బాగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌ కోసం రూ. 73 వేల కోట్లను ఈ స్కీమ్‌‌‌‌ కోసం బడ్జెట్‌‌‌‌లో   కేటాయించారు.  ఆర్థిక సంవత్సరం స్టార్టయిన మొదటి  మూడున్నర నెలల్లోనే ఇందులో  రూ. 41,187.06 కోట్లు ఖర్చు అయిపోయాయి. మొదటి మూడు నెలల్లో బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో 56.4 శాతం ఫండ్స్‌‌‌‌ను ఈ స్కీమ్‌‌‌‌ కింద వేతనాలుగా ఇచ్చారు. దీన్ని బట్టి ఈ స్కీమ్‌‌‌‌కు ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో తెలుస్తోంది. ప్రజలు కూడా ఈ స్కీమ్‌‌‌‌ ద్వారా వచ్చే పనులకు ఎగబడుతున్నారు.  కరోనా దెబ్బతో ప్రజల ఆదాయాలు పడిపోయాయి. కష్టపడతామంటే పనులు దొరకడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం వాళ్లకు పెద్ద దిక్కుగా మారింది.  డిమాండ్‌‌‌‌ను బట్టి మహాత్మ గాంధీ రూరల్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ గ్యారెంటీ (ఎంజీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈజీ–ఉపాధి హామీ) స్కీమ్‌‌‌‌ కింద రాష్ట్రాలకు కేంద్రం ఫండ్స్ కేటాయిస్తోంది. అందువలన అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఫండ్స్‌‌‌‌ అందవు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు ఎక్కువగా జరుగుతున్నాయి.

రాష్ట్రంలో రోజుకి సగటున రూ. 237 వేతనం..
‘ఉపాధి హామీ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 73 వేల కోట్లను బడ్జెట్‌‌‌‌లో కేటాయించాం. ఇందులో రూ. 41,187 కోట్లను మొదటి మూడున్నర నెలల్లోనే ఖర్చు చేయగలిగాం’ అని కేంద్ర రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సహాయ మంత్రి  నిరంజన్ జ్యోతి పార్లమెంట్‌‌‌‌లో పేర్కొన్నారు. ఏప్రిల్‌‌‌‌1 నుంచి  జూలై 23 మధ్య ఈ స్కీమ్‌‌‌‌ కింద 6.51 కోట్ల మందికి ఉపాధి కల్పించామని అన్నారు. మొత్తం 131 కోట్ల రోజులు పనులు జరిగాయని పేర్కొన్నారు. కాగా, దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి రోజుకి సగటున రూ. 180 ఇస్తున్నారు. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లలో ఒక వ్యక్తికి రోజుకి  సగటున రూ. 237 ఇస్తున్నారు.  2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌‌‌‌లో రూ. 61,500 కోట్లను ఉపాధి హామీ పథకం కోసం కేటాయించారు. కరోనా కారణంగా మరో రూ. 40 వేల కోట్లను యాడ్ చేసి రూ. 1,11,170.86 కోట్లకు పెంచారు.   కరోనా వలన 2020–21 లో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వలస కూలీలు తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడం పెరిగింది. దీంతో ఈ స్కీమ్‌‌‌‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో  100 రోజుల పనిని ప్రభుత్వం కల్పించింది. కిందటేడాది ఉపాధి హామీ పథకం వలన 11.19 కోట్ల మందికి పని కల్పించారు. మొత్తం 389.23 కోట్ల రోజుల పని జరిగింది.  ఈ స్కీమ్‌‌ ద్వారా అన్‌‌‌‌స్కిల్డ్‌‌‌‌ లేబర్స్‌‌‌‌కు 100 రోజుల పాటు పని కల్పిస్తారు. ఈ స్కీమ్‌‌‌‌ కింద చెరువులు, పొలాలను బాగుచేయడం వంటివి చేస్తున్నారు. 2021–22 లో ఇప్పటి వరకు 25 లక్షల అసెట్లను మెరుగుపరిచారు.

100 రోజులు అప్పుడే అయిపోయాయ్‌‌‌‌..
ఉపాధి హామీ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రొవైడ్‌‌‌‌ చేస్తున్న 100 రోజుల పనిని చాలా మంది ఇప్పటికే పూర్తి చేసేశారు.  ఎంజీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈజీ పోర్టల్‌‌‌‌లోని డేటా ప్రకారం, ఏప్రిల్‌‌‌‌ 1– జూలై 6 మధ్య 4.90 కోట్ల కుటుంబాలు  ఉపాధి హామీ కింద పనిచేస్తున్నాయి. ఇందులో 2.5 లక్షల కుటుంబాలు ఇప్పటికే తమకు కేటాయించిన 100 రోజుల పనిని పూర్తి చేసేశాయి. ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోందని, ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తున్న 100 రోజుల పనిని పెంచాలని ప్రభుత్వాన్ని యాక్టివిస్ట్‌‌‌‌లు కోరుతున్నారు. కరోనా వలన ప్రజల ఆదాయాలు పడిపోయాయని అంటున్నారు. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు ఉపాధి హామీ పథకం కింద ప్రొవైడ్ చేస్తున్న పని రోజులను 100 నుంచి 150 కి పొడిగిస్తున్నారు. కరోనాను కూడా జాతీయ విపత్తుగా గుర్తించి పని రోజులను 150 కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.