రేపటి నుండి ఆగస్టు నెల ప్రారంభమవుతోంది. అయితే ఆగస్టు 1 నుండి మీ ఆదాయం పై ప్రభావం చూపే కొన్ని రూల్స్ రాబోతున్నాయి. రైలు టికెట్ల బుకింగ్ నుంచి గ్యాస్ సిలిండర్ల ధరల వరకు ఇలా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటో చూద్దామా...
1. రైల్వే తత్కాల్ బుకింగ్స్
రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పశ్చిమ మధ్య రైల్వే ఆగస్టు 1 నుండి కొత్తగా టోకెన్ సిస్టమ్ తీసుకువస్తోంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి, క్యూలో గంటలపాటు నిలబడే ఇబ్బంది తప్పుతుంది. ముందే టోకెన్ తీసుకుని, మన వంతు వచ్చినప్పుడు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
2. ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలు
ప్రతి నెలా మొదటి తేదీన ప్రభుత్వ చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వస్తున్న మార్పుల ఆధారంగా, ఆగస్టు 1న కూడా కమర్షియల్, చిన్న సిలిండర్ల ధరలు మారే అవకాశం ఉంది. గత నెలలో వీటి ధరలు కాస్త తగ్గినా సంగతి మీకు తెలిసిందే.
3. విండ్ఫాల్ ట్యాక్స్
చమురు ఉత్పత్తి చేసే కంపెనీలు ఊహించని విధంగా భారీగా లాభాలు ఆర్జిస్తే ప్రభుత్వం వాటిపై 'విండ్ఫాల్ ట్యాక్స్' విధిస్తుంది. యుద్ధాలు లేదా అంతర్జాతీయ పరిణామాల వల్ల ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో, ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ పన్నును సమీక్షిస్తుంది.
4. ఐటీఆర్ (ITR) ఫైలింగ్ డెడ్లైన్
ఆదాయపు పన్ను రిటర్నులు (ITR-1, ITR-2) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026తో ముగుస్తుంది. ఒకవేళ గడువులోగా ఫైల్ చేయకపోతే, జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ ఏడాది ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ. 5,000, అంతకంటే తక్కువ ఉంటే రూ. 1,000 జరిమానా పడుతుంది.
ALSO READ : ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. ఫుల్ హాలీడేస్ లిస్ట్ ఇదే!
5. క్రెడిట్ కార్డులు & బ్యాంకింగ్ రూల్స్
ఆగస్టు 1 నుంచి చాలా వరకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రూల్స్ను మార్చబోతున్నాయి. దింతో రివార్డ్ పాయింట్లు, ఆలస్యంగా బిల్లు కడితే వేసే ఫైన్లు, ఇతర సర్వీస్ ఛార్జీల్లో మార్పులు ఉండబోతున్నాయి. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు, ఆధార్ ఆధారిత కొత్త CKYC నిబంధనలు కూడా మారే అవకాశం ఉంది. అలాగే ఈ నెల ఆర్బీఐ (RBI) మానిటరీ పాలసీ మీటింగ్ ఆగస్టు 3 నుండి 5 వరకు జరగనుంది.
