- జగిత్యాల కేంద్రంగా వెలుగులోకి.. స్వయంగా బయటపెట్టిన వీసీ
- నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
- 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల డిస్మిస్
- వారంతా అగ్రికల్చర్ ఏఈఓలే
- అక్రమార్కులను వదిలిపెట్టమన్న వీసీ జానయ్య
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీ లో వీసీ ఆకస్మిక తనిఖీల సందర్భంగా అనుమానం తలెత్తి, కమిటీతో విచారణ చేపట్టగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ తతంగం వెలుగుచూసింది. దీంతో ఘటనపై వర్సిటీ పాలకవర్గం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ సర్వీస్ కోటాలో అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తూ లీకేజీకి పాల్పడిన 35 మంది ఏఈఓల ప్రవేశాలను రద్దు చేసి, వారిని వ్యవసాయ శాఖకు తిరిగి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లీకేజీని బయటపెట్టిన వీసీ..
ఇటీవల వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులు, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్టు అనుమానం వచ్చింది. దీంతో ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టేందుకు ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ చేపట్టి లీకేజీ నిజమేనని తేల్చింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ, ఇన్ సర్వీస్ కోటాలో వర్సిటీలో మూడో సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దాదాపు 35 మంది అభ్యర్థులు, వర్సిటీ సిబ్బంది సహకారంతో ప్రశ్నపత్రాలను ముందుగానే లీక్ చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర అగ్రికల్చర్ కాలేజీల విద్యార్థులకు పంపినట్టు తేల్చింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారినట్టు, ఒక పథకం ప్రకారం కొన్నేండ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్టు కమిటీ నిర్ధారించింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన వర్సిటీ.. ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన దాదాపు 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఘటనతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టం: వీసీ జానయ్య
ఈ సందర్భంగా అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య మాట్లాడుతూ, 2014 నుంచి 2024 వరకు పదేండ్ల పాటు యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని.. అందులో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం ఒకటని పేర్కొన్నారు. పరిస్థితిని గమనించి వెంటనే ప్రక్షాళన మొదలుపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ వ్యవహారాన్ని సైబర్ నేరాల విభాగానికి అప్పగించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతామన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల విధానాన్ని సమగ్రంగా సమీక్షించి, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
