
- సర్కార్ బడుల్లో సకల సౌకర్యాలు
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అనేక వసతులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పేదలు ఉన్నత చదువులు చదవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రైవేటులో చదివించి తల్లిదండ్రులు అప్పులపాలు కావద్దని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి సన్నబియ్యం, రుచికరమైన ఆహారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేశ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న వసతులతో కూడిన పోస్టర్ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 120 బీసీ కాలేజీ హాస్టళ్లు, 64 ఎస్సీ, 20 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి మాట్లాడుతూ.. విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా లగ్జరీగా చదువుకునే వెసులుబాటు రాష్ట్రంలో ఉందన్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని హాస్టళ్లను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసచారి, పగిళ్ల సతీశ్, నక్క రమేశ్, గ్యార సతీశ్, మస్క పవన్ కుమార్, బాలయ్య తదితరులు
పాల్గొన్నారు.