కులవృత్తులకు రూ. లక్ష రుణం ఎన్నికల స్టంట్....బీసీ బంధు ఏమైంది కేసీఆర్

 కులవృత్తులకు రూ. లక్ష  రుణం  ఎన్నికల స్టంట్....బీసీ బంధు ఏమైంది కేసీఆర్

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలతో బీసీలను మభ్యపెడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య  విమర్శించారు. కేబినెట్ మీటింగ్లో బీసీ  కులవృత్తులు చేసుకొనే వారికి లక్ష రూపాయలు రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని... ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో ఇదే తరహాలో రుణాలు ఇస్తామని.. 5 లక్షల 77 వేల మంది నుంచి అప్లికేషన్లు తీసుకొని పెండింగ్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. బీసీ బంధు కోసం తాము పోరాటాలు చేస్తే... త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పటి వరకు  నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కువ పన్నులు కడుతున్న బీసీలను పాలకులు బిక్షగాళ్లుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని... తన వైఖరి మార్చుకోవాలని.. లేకపోతే రానున్న ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాద్ కాచిగూడలో బిసి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

దేశంలో ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని  ఆయన  డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ  ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను మే 21న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు బీసీ ఉద్యోగులు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.