న్యూఢిల్లీ, వెలుగు/ పట్నా: కొత్త హామీల కంటే ముందు, పాత హామీల లెక్క తేల్చాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీ దేశంలో మోసపూరిత వ్యాపారాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అంటే అబద్ధాలు, అన్యాయాల హామీ అని విమర్శించారు. దేశం కన్న కలలతో పాటు కాంగ్రెస్ న్యాయం చేస్తోందని భరోసా ఇచ్చారు. గురువారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, నల్లధనాన్ని తిరిగి తేవడం, ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ, దేశంలో 100 స్మార్ట్ సిటీల తయారీ’ అంటూ గత ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీలను ఇందులో గుర్తు చేశారు.
బిహార్లో యాత్ర కొనసాగింపు
భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో ర్యాలీతో తిరిగి ప్రారంభమవుతుంది. పార్టీ చీఫ్ ఖర్గే పాల్గొంటారు. అనంతరం టెకారి శాసనసభ ప్రాంతంలోని రైతులతో రాహుల్ ముచ్చటిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్ఎల్ సీ ప్రేమ్ చంద్ర మిశ్రా మీడియాకు తెలిపారు.