
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే రచ్చ
- ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రంపై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నేత రాహుల్
- విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా సభ్యుల నినాదాలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే నీట్ పేపర్ లీక్ అంశం లోక్ సభను కుదిపేసింది. నీట్అవకతవకల విషయంలో కేంద్రంపై ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విరుచుకుపడ్డారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని మండిపడ్డారు. ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత సోమవారం తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ నీట్పేపర్ లీక్తోపాటు యూజీసీ నెట్, సీయూ సెట్ లాంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇస్తుండగా.. విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.
విద్యావ్యవస్థలోనే తీవ్ర సమస్య: రాహుల్ గాంధీ
నీట్–2024 ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది మన విద్యా వ్యవస్థలోనే తీవ్ర సమస్య అని రాహుల్గాంధీ పేర్కొన్నారు. నీట్ ఒక్కటే కాకుండా అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతున్నదని విమర్శించారు. పరీక్ష విధానంలో తప్పులు జరిగాయని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని ప్రతి ఒక్కరినీ నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు.
దేశంలోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అసలేం జరుగుతుందో కూడా మంత్రికి అర్థం కావడం లేదని తనకు అనిపిస్తున్నదన్నారు. మన పరీక్షల వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైందనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొన్నదని తెలిపారు. విద్యా వ్యవస్థ అంతా మోసపూరితమని లక్షలాది విద్యార్థులు భావిస్తున్నట్టు చెప్పారు. సంపన్నులైతే డబ్బు చెల్లించి దేశ పరీక్షల వ్యవస్థను కొనుగోలు చేయవచ్చని స్టూడెంట్స్ నమ్ముతున్నారని చెప్పారు. ఈ కీలకమైన ఈ వ్యవహారంపై ఒక రోజంతా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మాకు అవగాహన ఉంది: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ అంశంపై తమకు పూర్తి అవగాహన ఉన్నదని, అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తనకు సభలో రాహుల్ సర్టిఫికెట్ అవసరంలేదని, ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రకటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వ్యవస్థను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వాలని కోరారు. తన పర్యవేక్షణలో ఎక్కడా ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని సభకు తెలిపారు. గత ఏడేండ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవని, ఎన్టీఏ ఇప్పటివరకూ 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. నీట్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నదని తెలిపారు.
పేపర్ లీక్స్లో మోదీ సర్కారు రికార్డు: అఖిలేశ్
పేపర్ లీక్స్ విషయంలో మోదీ సర్కారు రికార్డు సృష్టించిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్చురకలంటించారు. కొన్ని సెంటర్లలో 2 వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం జరగదని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్విమర్శించారు. గత ఏడేండ్లలో 70 సార్లు పేపర్ లీక్ అయిందని, నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు.
బిహార్కు స్పెషల్ స్టేటస్ ప్రతిపాదన లేదు: కేంద్రం
బిహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏదీలేదని కేంద్ర సర్కారు తేల్చిచెప్పింది. ఈమేరకు సోమవారం పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది. ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా? అని జేడీయూ ఎంపీ రామ్ప్రిత్ మండల్ ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాతపూర్వక జవాబిచ్చారు. బిహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.
583 హామీలు నెరవేర్చాం: ఎల్ మురుగన్
గత మూడేండ్లలో పార్లమెంట్లో మంత్రులు మొత్తం 913 హామీలు ఇవ్వగా.. అందులో 583 నెరవేర్చినట్టు రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. మిగతా 330 హామీలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. పాలసీల్లో మార్పులు, సవరణల కారణంగా కొన్ని హామీలు అమలు చేయలేదని తెలిపారు.
ఎన్టీఏలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ స్టాఫ్: కేంద్ర విద్యాశాఖ
జాతీయ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో 170 మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో వెల్లడించింది. అయితే, ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను అవుట్సోర్సింగ్కు ఇవ్వలేదని స్పష్టతనిచ్చింది. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.