కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వారు ప్రయాణిస్తున్న విమానం భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో భోపాల్ లోనిరాజాభోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం కూడా విమాన ప్రయాణానికి ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది.
జులై 18వ తేదీ మంగళవారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని భోపాల్ విమానాశ్రయానికి మళ్లించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. భోపాల్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం.