
భోపాల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ట్రంప్ ఫోన్ కాల్ కారణంగానే ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్నారు. ‘‘నరేందర్.. సరెండర్’’ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని ఆరోపించారు. ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్యారెక్టర్ అని విమర్శించారు. వీళ్లంతా ఇలాగే లొంగిపోతారని, చరిత్ర కూడా ఇదే చెప్తున్నదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కన్వెన్షన్లో రాహుల్ పాల్గొని మాట్లాడారు.
‘‘ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ.. ఏం చేస్తున్నారని ఫోన్లో ట్రంప్ అడిగారు. ఆయన సరెండర్ అనగానే ఈయన కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తూ.చా తప్పకుండా మోదీ పాటించారు’’ అని రాహుల్ విమర్శించారు. ‘నరేందర్.. సరెండర్’అని ట్రంప్ అనగానే మోదీ ‘ఎస్... సర్’ అని అన్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ నుంచి ఫోన్ రాగానే మోదీ భయపడిపోయారని, ఆయన ఒత్తిడి చేయడంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు.
1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదన్నారు. అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్తాన్ను ఇండియా విచ్ఛిన్నం చేసిందన్నారు. అగ్రరాజ్యాలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు. యూఎస్ సెవెంత్ ఫ్లీట్ ముందుకు సాగినా.. ‘‘నేను చేయాల్సింది చేస్తా’’ అని గట్టిగా సమాధానం చెప్పారని రాహుల్ గుర్తుచేశారు.
గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్.. వీరంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని తెలిపారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉందంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగదని స్పష్టం చేశారు.
డబ్బు ప్రజలది.. లాభాలు అదానీకా..?
ప్రజాధనంతో మోదీ ప్రభుత్వం.. ప్రైవేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్లో ఎల్ఐసీ రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ‘‘డబ్బు, పాలసీ, ప్రీమియం మీవి... భద్రత, సౌకర్యం, లాభం అదానీది!” అంటూ రాహుల్ ట్వీట్చేశారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు.. సామాన్యుల నుంచి సేకరించిన డబ్బును అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థల లాభం కోసం ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. మోదీ అమలు చేస్తున్న ‘‘క్రోనీ క్యాపిటలిజం’’.. సామాన్య ప్రజల ఆర్థిక భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ కామెంట్లపై బీజేపీ ఫైర్
రాహుల్ చేసిన ‘‘నరేందర్.. సరెండర్” కామెంట్లపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది వ్యక్తిగత దాడి అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ చాలా ఆవేశంతో ఉన్నాడని, స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. 1962లో నెహ్రూ హయాంలోనే అస్సాంను దాదాపుగా చైనాకు అప్పగించారని గుర్తుచేశారు. జాతీయ భద్రత అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన చారిత్రక తప్పిదాలను రాహుల్ గాంధీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.