గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా సభ్యులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు SOT పోలీసులు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలోని రాంరెడ్డి నగర్ లో బీహార్ కు చెందిన శిబుకుమార్ కిరాణా షాపు నుంచి రూ. 11 వేల 500 విలువ చేసే 150 గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్స్ ను ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు అమ్ముతున్నట్టు గుర్తించారు.
పటాన్ చెరులోనూ గంజాయి చాక్లెట్స్ ను అమ్ముతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు మాదాపూర్ SOT పోలీసులు. బీహార్ కు చెందిన సీతారాం సింగ్ కిరాణా షాప్ నుంచి 19 వందల 60 గంజాయి చాక్లెట్స్ ఉన్న 49 పాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 30 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజాంపేట్ లోని శేఖర్ పాన్ షాపు, కింగ్స్ పాన్ షాపులపై బాలానగర్ SOT పోలీసులు దాడులు చేశారు. రూ. 16 వేల విలువ చేసే నిషేధిత సిగరెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అటు మాదాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ దగ్గర గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి కేజీకి పైగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు . విద్యార్థులకు, కూలీలకు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.