రాష్ట్రమంతా వానలు.. వాయుగుండం ప్రభావంతో మంగళవారం దంచికొట్టిన వర్షాలు

రాష్ట్రమంతా వానలు.. వాయుగుండం ప్రభావంతో మంగళవారం దంచికొట్టిన వర్షాలు
  • వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు
  •     కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. హైదరాబాద్​ సిటీలో దంచికొట్టిన వాన
  •     నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ 
  • జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, హైదరాబాద్​లో మంగళవారం భారీ వాన కురిసింది. బుధవారం కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మిగతా రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు పడే చాన్స్​ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.

అలాగే.. మంగళవారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా మఖ్దూంపూర్​లో 7.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా జుక్కల్​లో 6.5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్​ జిల్లా హీరాపూర్​లో 6, తాంసిలో 5.9, కామరెడ్డి జిల్లా పిట్లంలో 5.8, యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపూర్​లో 4.3, వికారాబాద్​ జిల్లా మోమిన్​పేటలో 4.1, మహబూబాబాద్​జిల్లా కొమ్ములవంచలో 4.1, సంగారెడ్డి జిల్లా దిగ్వాల్​లో 4, వరంగల్​జిల్లా చెన్నారావుపేటలో 3.9 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. హైదరాబాద్​ సిటీలోని అన్ని సర్కిళ్లలోనూ వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా ముషీరాబాద్​లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తార్నాకలో 5, బన్సీలాల్​పేటలో 4.6, ఓయూలో 4, బోయిన్​పల్లిలో 4, రహ్మత్​నగర్​లో 3.9, తుర్కయంజాల్​లో 3.8, చందానగర్​లో 3.7, సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.