విస్తారంగా వర్షాలు... రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

విస్తారంగా వర్షాలు... రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  రైతులు దుక్కి దున్ని నారు మడులు వేశారు.  ఈ నేపథ్యంలో పంట సాగు చేసే రైతులు అధిక దిగుబడి సాధించేందుకు కొన్ని రకాల  ప్రత్యేక పద్దతులను అవలంభించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాకాలంలో తెగులు ఎక్కువగా వచ్చే అవకాశంఉంది.  వీటి బారి నుంచి కాపాడుకోవాలి. వివిధ పంటలతో పాటు, మురుగునీటి నిల్వను అరికట్టడం, పురుగు మందులు పిచికారి వంటి వ్యవసాయ పనులపై వ్యవసాయ నిపుణులు కొన్ని సూచనలను జారీ చేశారు. ఇప్పుడు ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .

భారీ వర్షాలతో పంట పొలంలోకి  మురుగు నీరు చేరుతుంది. ఇంకా కొన్ని రోజుల పాటుఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు పంటపొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 

వివిధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలు:


 వరి:

  • నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120 నుంచి -125 రోజుల) వరి రకాల నారుమళ్ళు  పోసుకోవడానికి అనువైన సమయం.
  • 25 మరియు 30 రోజుల వయస్సు ఉన్న మద్యకాలిక .. స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి.
  • దీర్ఘకాలిక వరి రకాల నారు బాగా ముదిరి (50రోజుల వయస్సు) ఆలస్యంగా నాటినప్పుడు ఆకు చివరలను తుంచి వేసి కుదురుల సంఖ్యను పెంచి కుదురుకు 6 నుండి 8 మొక్కల చొప్పున నాటువేయాలి.
  •  నత్రజని ఎరువులను సిఫారసు కంటే 25శాతం పెంచి మూడు దఫాలుగా కాని లేదా  రెండు దపాలుగా అంటే 70శాతం నాటే సమయంలో మిగతా 30శాతం అంకురం దశలో వేసుకోవాలి.
  • వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోఫూరాన్ 3జి గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు.
  • ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగము చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడము వల్ల సమయము, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
  •  నాటు పెట్టిన తర్వాత ప్రతి 2  మీటర్లకు కాలి బాటను తీయటం వల్ల గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది.
  • ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 జి గుళికలను నాటిన 10 నుండి 15 రోజుల మధ్య పిచికారి చేయడం వలన  కాండం తొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించుకోవచ్చు.      

 పత్తి:

  •  వర్షాలు కొంచెం  తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 రోజుల, 40 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ దూరంలో పాదులుతీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలి.
  • ముంపునకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 13-0-45 లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
  • నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళను నివారించుటకు 3గ్రా. కాపర్ -అక్సీ-క్లోరైడ్ లేదా 2 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేబ్  శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
  • పత్తి పంటలో వచ్చే గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి (2 నుంచి 3 ఆకుల దశలో ఉన్న కలుపు మొక్కలు) 2 మి.లీ. క్విజలోఫాప్ ఇదైల్ + 1.25 మి.లీ. పైరిథాయోబ్యాక్ సోడియం కలుపు మందులను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • మొక్కజొన్న:
  • మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి.
  • అధిక వర్షాల వల్ల నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా. డిఎపీ ఎరువును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
  • మొక్కజొన్న పంటను జులై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునేందుకు అనుకూల సమయం.
  • మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవచ్చు.
  • వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పోటాప్ ను వేసుకోవాలి.

 జొన్న:

  • ముందస్తు నివారణ చర్యల భాగంగా జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు, పంట విత్తిన 30- నుంచి35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫూరాన్ 3 జి గుళికలను కాండము సుడులలో వేయాలి.

కంది:

  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పైటాప్తోర ఎండుతెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ  తెగులు గమనించినచో నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

 సోయాచిక్కుడు:

  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
  • సోయాచిక్కుడు పంటలో కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే 2.5 గ్రా కార్బండాజిమ్ + మ్యాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  •  ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వలన 25 రోజుల పంటలో 250 మి.లీ. ఇమాజితాపిర్ 10% SL లేదా 40గ్రా. ఇమాజితాపిర్ + ఇమాజమాక్స్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి గడ్డి, వేడల్పాకు కలుపు జాతి మొక్కలను నివారించాలి.
  •  వేరుశనగ:
  • ప్రస్థుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు మొక్కల మొదళ్ళ దగ్గర 2గ్రా. కార్బండజిమ్ + మ్యాంకోజేట్ మందును లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.

 కూరగాయలు:

  • టమాట, వంగ, మిరప, బంతి పంటల నారుమళ్ళలో నారు కుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు, అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

 చెరకు:

  • ముంపునకు గురైయ్యే ప్రాంతాలల్లో ప్రతీ 25 మీటర్లకు ఊటకాలువలు ఏర్పాటు చేసుకొని తోటలో నీరు నిలువకుండా మురుగును నీటి కాలువల ద్వారా తొలగించాలి.