శంషాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకే తాను ఆయనను కలిశానని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని శంషాబాద్, మైలార్దేవ్ పల్లి ముఖ్య నాయకులతో తన నివాసంలో ప్రకాశ్ గౌడ్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలిసింది.
మరికొంత మంది ముఖ్య నేతలతో చర్చించి రెండు మూడ్రోజుల్లో పార్టీ మారే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తానని ప్రకాశ్ గౌడ్ కార్యకర్తలకు చెప్పారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే తాము మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతామని పార్టీ ముఖ్య నాయకులు ప్రకాశ్ గౌడ్కు స్పష్టం చేశారు. మరోవైపు, కార్యకర్తలు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఎదురు తిరగడంతో తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకాశ్ గౌడ్ హామీ ఇచ్చారు.