
సీఎం రేవంత్ తో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లో సుమారు అరగంట పాటు ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు ప్రకాశ్ గౌడ్. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రేవంత్ ను కలవడం చర్చనీయాంశగా మారింది. తర్వాత వారు పార్టీ మారట్లేదని..నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు వివరణ ఇచ్చారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు.. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న కామెంట్స్ చేశారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తామంటే తామే వద్దంటున్నామని మధుయాష్కి గౌడ్ చెప్పారు.
మరో వైపు త్వరలో పులి బయటకొస్తది..ఆట మొదలు పెడ్తదని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.