
సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పదం ‘నెపోటిజం’ (బంధు ప్రీతి). హిందీ చిత్ర పరిశ్రమలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ ఓపెన్ కామెంట్స్ చేశారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా దీనిపై స్పందించింది. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మోడల్గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి వచ్చిన రకుల్.. తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఇక రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్ షోలో మాట్లాడిన ఆమె..
నెపోటిజంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న మాట నిజమే. దాని వల్ల ఎన్నో ఛాన్స్లు వదులుకున్నా. కానీ అవకాశాలు కోల్పోయానని నేనెప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఆర్మీలో పనిచేసిన మా నాన్న సలహాలు, సూచనలు నాకు చాలా నేర్పాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. మనకు దక్కని వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోకూడదు.
వ్యక్తిగతంగా ఎదగడం ఎలా అనేదానిపైనే నేను ఫోకస్ పెడతాను’ అని చెప్పింది. ‘ఒక స్టార్ కిడ్కు వచ్చినంత ఈజీగా మిగతా వారికి అవకాశాలు రావని, అదంతా వాళ్ల తల్లిదండ్రుల కష్టం అంటూ స్టార్ కిడ్స్పై విమర్శలు చేసింది రకుల్. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్కు జంటగా ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది.