ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు

ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో యూరియా, అమోనియా కోసం రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఎక్కడికక్కడ పలు రాష్ట్రాల్లో యూరియా, అమోనియా ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేయించారని చెప్పారు. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ లో 12 లక్షల టన్నుల యూరియా, 7 లక్షల 25వేల టన్నుల అమోనియా ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ మైదానంలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ద్వారా ఎంతోమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతులకు ఈ ఎరువుల కర్మాగారం నుంచి చాలా తక్కువ ధరకే యూరియా, అమోనియా లభిస్తాయన్నారు. ఇది తెలంగాణ రైతులకు వరప్రదాయిని లాంటిదన్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

ఇక కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు నాయకులు కలిసి ఈనెల 12న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించనున్న ఎన్టీపీసీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు వివేక్ వెంకటస్వామి ఇంట్లో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మోడీ పర్యటనకు జరిగిన ఏర్పాట్లపై, సభను విజయవంతం చేసే అంశంపై చర్చించారు. ఈనెల 12న ప్రధాని మోడీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం స్థానికంగా జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు.