మీ అభిమానమే నన్ను గెలిపిస్తది : కేఎస్ రత్నం

 మీ అభిమానమే నన్ను గెలిపిస్తది : కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల వాసుల అభిమానమే తనను గెలిపిస్తుందని ఆ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్, చిలుకూరు, అప్పోజిగూడ, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, సురంగల్, ముర్తజగూడ, అమ్డాపూర్, ఖాసింబౌలి, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

మొయినాబాద్ మండలంలోని గ్రామాల్లో మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి కేఎస్ రత్నం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అవినీతి పాలనకు ముగింపు పలకాలన్నారు. వివాద రహితుడైన కేఎస్ రత్నంను గెలిపించాలని కోరారు.  కేఎస్​రత్నం మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులు, మహిళలు, స్టూడెంట్లు, బీసీలు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో చేవెళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. 

ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీనిచ్చారు. అప్పోజిగూడ సర్పంచ్ రాజు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేఎస్ రత్నం సమక్షంలో బీజేపీలో చేరారు.