- డాలర్ విలువ తగ్గడం, బంగారం ధర పెరగడంతో పెరిగిన ఆర్బీఐ ఆదాయం
- రూ.3 లక్షల కోట్ల పైనే వస్తాయని అంచనా వేసిన కేంద్రం
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రికార్డ్ లెవెల్లో డివిడెండ్ ఇచ్చింది. 2025–26 కి గాను రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను బదిలీ చేసింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.69 లక్షల కోట్లు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన ఆర్బీఐ, తాజాగా 27 శాతం ఎక్కువ నిధులను ఇచ్చింది . 2023-–24 లో రూ.2.11 లక్షల కోట్లను, 2022–-23లో రూ.87,416 కోట్లను కేంద్రం అందుకుంది. అయితే తాజాగా అందుకున్న డివిడెండ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో వేసిన అంచనా కంటే కొద్దిగా తక్కువగా ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్లు, ఆర్బీఐ మిగులు నిధుల బదిలీ ద్వారా మొత్తం రూ.3.16 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
1. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, ఆదాయం
ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ (ఆస్తుల) సైజ్ ఏడాది లెక్కన 20.61 శాతం పెరిగి రూ.91.97 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని పెంచడం కోసం దాదాపు రూ.తొమ్మిది లక్షల కోట్ల విలువైన బాండ్లను కమర్షియల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కొనుగోలు చేయడం కూడా ఇందుకు ఒక కారణం. ఆర్బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరగగా, ప్రొవిజన్లకు ముందు ఖర్చులు 27.60 శాతం పెరిగాయి.
2. ఆదాయం పెరిగిందిలా..
దేశీయ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలపై వచ్చే ఆదాయం, నోట్ల ముద్రణ ఫీజుల ద్వారా ఆర్బీఐకి ఈ డివిడెండ్ ఆదాయం లభిస్తుంది. 2025–26లో డాలర్ విలువ దాదాపు 10శాతం పడిపోగా, బంగారం ధరలు ఏకంగా 60శాతం పెరిగాయి. దీంతో ఆర్బీఐకి భారీగా లాభాలొచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో జోక్యం, ఇన్వెస్ట్మెంట్ ఆదాయం వల్ల కూడా లాభాలు పెరిగాయి.
3. కంటింజెంట్ రిస్క్ బఫర్
అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించే 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (సీఆర్బీ) ను బ్యాలెన్స్ షీట్ పరిమాణంలో 4.5శాతం నుంచి 7.5శాతం మధ్య ఉంచాలి. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ బఫర్ను 6.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,09,379.64 కోట్లను సీఆర్బీకి బదిలీ చేసింది. గతేడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే.
4. ద్రవ్యలోటును పూడ్చటం కష్టమే
ఆర్బీఐ ఇచ్చిన రూ.2.87 లక్షల కోట్లు పెద్ద మొత్తమే అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించుకున్న 4.3శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోవడానికి ఇది పూర్తిగా సరిపోకపోవచ్చని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు, ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్లో ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఆర్బీఐ నుంచి వచ్చిన డివిడెండ్ సాయపడుతుంది. కాగా, ఇరాన్ యుద్ధం వల్ల ఈ ఏడాది రూపాయి విలువ దాదాపు ఏడు శాతం బలహీనపడగా, పదేళ్ల బాండ్లపై రాబడులు 7.10శాతానికి పెరిగాయి.
