న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం కారణంగా తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్బీఐ విక్రయించిందని వచ్చిన వార్తలను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం తీవ్రంగా ఖండించింది. తమ వద్ద ఉన్న ఫిజికల్ గోల్డ్ నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని, అది 880.52 టన్నులుగానే స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఫ్యాక్ట్-చెక్ విడుదల చేసింది.
ఆర్బీఐ వద్ద ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. గతేడాది మార్చి 31 నాటికి ఇది 879.58 మెట్రిక్ టన్నులు. మన విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025 నాటి 13.92శాతం నుంచి ఈ ఏడాది మే 22 నాటికి 16.85శాతానికి పెరిగింది. బంగారం ధరలు పెరగడంతో ఈ వృద్ధి నమోదైంది. రూపాయి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7శాతం క్షీణించింది. ఈ ఏడాది మే 20 న డాలర్తో రూ.96.86 వద్ద ఆల్టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది.
