
ముంబై: ఇప్పుడు కూడా రూ.2వేల నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2వేల బ్యాంకు నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, కేవలం రూ. 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయని శుక్రవారం తెలిపింది. గత మే 19న ఆర్బీఐ రూ. 2వేల డినామినేషన్ బ్యాంక్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి.
గత నెల 24 నాటికి వీటి విలువ రూ.8,470 కోట్లకు తగ్గింది. అంటే, మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2వేల నోట్లలో 97.62 శాతం తిరిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2వేల బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయవచ్చు. వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2వేల బ్యాంకు నోట్లను పంపవచ్చు. రూ.2 వేల నోట్లను కలిగిన ఉన్న వాళ్లు, సంస్థలు వాటిని సెప్టెంబరు 30, 2023లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.