ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

సినీ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఆయన ఫాంహౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కృష్ణంరాజుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్న ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు.

అంతకముందు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి కనకమామిడి ఫాంహౌస్ వరకు అంతిమయాత్ర జరిగింది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయన గన్ సెల్యూల్ చేశారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోపలికి అనుమతించారు. 

టాలీవుడ్ రారాజుగా పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.