- ఎగుమతులు @ ఆల్టైం హై!..రూ.35.39 లక్షల కోట్లు అంచనాలకు మించి నమోదు
న్యూఢిల్లీ: మనదేశ సేవల ఎగుమతుల విలువ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగి 421.32 బిలియన్ డాలర్లుగా (రూ.35.39 లక్షల కోట్లు) నమోదయింది. అంచనా వేసిన 418.31 బిలియన్ డాలర్లు (రూ.35.13 లక్షల కోట్లు) కంటే ఇది ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో దేశ వస్తు సేవల ఎగుమతులు 863.11 బిలియన్ డాలర్లు (రూ.72.50 లక్షల కోట్లు) ఆల్టైమ్ గరిష్ట స్థాయిని తాకినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు.
సేవల ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 8.71 శాతం పెరిగాయి. దేశ మొత్తం ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.59 శాతం వృద్ధి చెందాయి. పశ్చిమాసియాలో యుద్ధం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో పురోగతి ఈ వృద్ధికి కారణమైంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రతి క్వార్టర్లోనూ గరిష్ట ఎగుమతులు రికార్డయ్యాయి.
ఐటీ, బిజినెస్ సొల్యూషన్స్, వృత్తిపరమైన నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన బలం. వస్తువుల ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్ డాలర్లకు (రూ.37.10 లక్షల కోట్లు) చేరాయి.
