ఉన్నావో బాలికల డెత్ మిస్టరీ.. వాటర్ బాటిల్‌లో విషం కలిపిన ఉన్మాది

ఉన్నావో బాలికల డెత్ మిస్టరీ.. వాటర్ బాటిల్‌లో విషం కలిపిన ఉన్మాది

యూపీ: యుక్త వయస్సులో వచ్చే ఆకర్షణనే ప్రేమ అనుకొని.. పరిపక్వత లేని ప్రేమను ఒప్పుకోలేదని ఉన్మాదానికి పాల్పడతున్నారు కొంతమంది యువకులు. దాంతో అప్పటివరకూ చనువుగా ఉన్న అమ్మాయిని చంపడానికి కూడా వెనుకాడట్లేదు. యూపీలోని ఉన్నావో లో ముగ్గురు బాలికలపై జరిగిన విషప్రయోగానికి కారణమదే. ఆ బాలికల్లో ఒకరిని ప్రేమించానంటూ స్నేహం చేసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగిన రోజే ఆ బాలిక చెల్లెలు(16), ఆమె బంధువైన మరో బాలిక(13) మరణించగా.. ప్రస్తుతం బాధితురాలు(17) చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారి చావుకు కారణమైన నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేయడంతో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రేమని ఒప్పుకోలేదనే కారణంతోనే బాలికలు తాగిన నీటిలో నిందితుడు విషం కలిపినట్లు లక్నో రేంజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీసింగ్ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలికల పక్క గ్రామానికి చెందిన వినయ్(18) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో బాలికల పొలం పక్కనే వినయ్ పొలం ఉండేదని, లాక్ డౌన్ సమయంలో వీరంతా పశువుల మేత కోసం పొలానికి వెళ్లినప్పుడు కలిసి తినేవారని, అక్కడ కాసేపు సమయం గడిపేవారని చెప్పారు. ఈ క్రమంలో వినయ్.. ఆ అక్కాచెల్లెళ్లలో ఒకరైన బాలిక(17)ను ప్రేమిస్తున్నానంటూ చనువుగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన నచ్చని బాలిక అందుకు ఒప్పుకోలేదు. దీంతో అప్పటిదాక ప్రేమించాననుకున్న బాలికపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. తన ప్రేమను తిరస్కరించిందని ఆ అమ్మాయిని చంపుదామనుకున్నాడు. అందుకోసం ఓ పక్కా ప్లాన్ వేశాడు.

ప్లాన్ ఎలా అమలుచేశారంటే..

ఎప్పటిలాగే పొలంలో పశువులను మేపడానికి వెళ్లి.. అంతా కలిసి తినే సమయంలో.. ఆ బాలిక చేత విషం కలిపిన నీటిని తాగించి చంపేద్దామనుకున్నాడు. ఇందుకోసం తన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందును వాటర్ బాటిల్ లో కలిపి బుధవారం పొలానికి తీసుకువెళ్లాడు. మధ్యాహ్న సమయంలో పక్కపొలంలో పనిచేస్తున్న బాలికల దగ్గరకు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించాడు.  వెంట తెచ్చుకున్న ఆ వాటర్ బాటిల్ ను తాను ప్రేమించిన బాలికకు ఇచ్చి చంపేద్దామనుకున్నాడు. కానీ ఆ నీటిని మిగతా ఇద్దరు బాలికలు కూడా తాగుతారని అనుకోలేదు. బాలికలు తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలను తిన్న తర్వాత ఆ నీటిని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాసేపటికి వారి నోటినుంచి నురగలు రావడంతో వినయ్ తో పాటు అతనికి  ఈ విషయంలో సాయం చేసిన ఓ మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు.

బాలికలు ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. బాలికలు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆ ముగ్గురిని కాన్పూర్ హాస్పిటల్ కు తరలించారు. వారిలో నిందితుడు ప్రేమించిన బాలిక కాకుండా మిగతా ఇద్దరు బాలికలు ఆ రోజునే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలు పరిస్థితి కూడా విషమించడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది.

నిందితుల్ని పట్టుకుంది ఇలాగే

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ కాల్చిన సిగరెట్ ముక్క, పెస్టిసైడ్ కలిపిన వాటర్ బాటిల్ ఉండడం గమనించారు. బాలిక ఫోన్ కాల్ రికార్డ్స్ ను పరిశీలించిన పోలీసులు.. ఆ సంఘటన జరిగిన రోజు వినయ్ ఎక్కడ ఉన్నాడో ట్రాక్ చేశారు. నేరం జరిగిన సమయంలో వినయ్ అక్కడే ఉన్నాడని లోకేషన్ ట్రాకింగ్ ద్వారా తేలడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి శైలిలో ఎంక్వయిరీ చేయడంతో .. బాలికలను అతనే చంపినట్లు ఒప్పుకున్నాడు. వినయ్ తో పాటు అతనికి సాయం చేసిన బాలుణ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతణ్ని కూడా అలాగే చంపాలి

అరెస్ట్ పై చనిపోయిన బాలికల కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. నిందితుణ్ని ఉరితీయలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారిలో తమ చిన్న కూతురితోపాటు , తమ సోదరి కూతురు కూడా ఉందని తెలిపారు. తమ పెద్ద కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందని అన్నారు. తమ పిల్లలు ఎలాగైతే బాధపడుతూ మరణించారో.. నిందితుణ్ని కూడా అలాగే చంపాలని బాలికల తల్లిదండ్రులు కోరారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.