
హైదరాబాద్, వెలుగు: కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన కేసుల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావులకు హైకోర్టులో ఊరట లభించింది. వేర్వేరు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో హాజరు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. కరోనా వ్యాప్తి సమయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు 40 కార్లు, 60 బైక్లతో ర్యాలీ నిర్వహించారంటూ ఈటలపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా నిబంధనలకు విరుద్ధంగా దుబ్బాకలో గాంధీ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించడంపై దుబ్బాక పోలీసులు రఘునందన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. ఇద్దరు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. వీటిని కొట్టేయాలంటూ ఇద్దరు ఎంపీలు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కింది కోర్టులో విచారణకు హాజరు నుంచి ఇద్దరికీ మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.