
కరీంనగర్: తనను ఓ హత్య కేసులో ఇరికేంచేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారంటూ రిటైర్డ్ సీఐ ఒకరు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఎస్.ఐ.బి. లో పనిచేసే వేణుగోపాల్ రావు అనే రిటైర్డ్ డీఎస్పీ ప్రభుత్వ అండతో తనను చంపేందుకు కుట్ర కూడా చేస్తున్నట్లు అనుమానం ఉందని సదరు వ్యక్తి లేఖలో పేర్కొన్నారు.
రిటైర్డ్ సీఐ, టీపీసీసీ అధికార ప్రతినిధి అయిన దాసరి భూమయ్య ఈ లేఖ రాశారు. అందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడిస్తూ.. హైదరాబాద్ కు చెందిన పోలీసు ఇన్ఫార్మర్ ఎక్కటి జైపాల్ రెడ్డిని సుఫారీ ఇచ్చి చంపించేందుకు తాను కుట్ర చేసానని, రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ వంకతో జైపాల్ రెడ్డిని వాళ్లే చంపి తనను హత్య కేసులో ఇరికించాలన్న కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. తాను సుఫారీ ఇచ్చినట్టు చేస్తున్న ప్రచారంలో నిజముంటే తనపై కేసు ఎందుకు పెట్టడం లేదు? అని భూమయ్య ప్రశ్నించారు.
తాను సీఐగా ఉన్నప్పుడు జైపాల్ రెడ్డిని 15 నెలల పాటు తన వెంట తిప్పి, ఏసీబీ తప్పుడు కేసులో ఇరికించారని గుర్తు చేశారు భూమయ్య . హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుంచి ఏకే-47 గన్ తోపాటు, మరో తుపాకీ పోయిన కేసులో తనను ఇరికించాలని చూస్తే ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డానని చెప్పారు. తాను నక్సలైట్లకు టార్గెట్ అని తెలిసీ కూడా గన్ మెన్లను ఇవ్వడం లేదని, లైసెన్స్ వెపన్ తీసుకోవడానికి తనకు అనుమతి ఉన్నా ఏసీబీ కేసు వంకతో వెపన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. జైపాల్ రెడ్డి అనే పోలీస్ ఇన్ఫార్మర్ కు రెండు లైసెన్స్డ్ తుపాకులున్నాయన్నారు.
తనపై జరుగుతున్న కుట్రపై సీఎం కేసీఆర్ విచారణ జరిపించాలని కోరారు భూమయ్య. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జీ కుంతియా దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లినట్టు మీడియాకు తెలిపారు.