ఆగస్టు నెల దర్శన కోటాకు సంబంధించి కీలక అప్ డేట్ రిలీజ్ చేసింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటా వివరాలు వెల్లడించింది టీటీడీ.
ఆర్జిత సేవ టికెట్లు:
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది టీటీడీ.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. అదే విధంగా వార్షిక పవిత్రోత్సవాల (23-08-26 నుండి 25-08-26) టికెట్లను కూడా మే 21 ఉదయం 10గం. ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి దర్శన కోటా విడుదల
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల:
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది టీటీడీ.
