
పత్తికి గిట్టుబాటు ధర కల్పించి, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దళారులు రైతులను మోసం చేస్తుంటే అండగా ఉండాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని రేవంత్ వాపోయారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నివేదిక ప్రకారం గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడితే.. ఈ ఏడాదిలో నవంబరు నాటికి 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. మొత్తంగా చూస్తే గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వారిలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో రైతులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. సరైన వ్యవసాయ విధానం లేకపోవడం.. పంటల ప్రణాళిక లేకపోవడం, రైతులకు దిశానిర్దేశం చేసే వారు లేకపోవడం, రుణ ప్రణాళికలు సరిగా అమలు చేయకపోవడం, ప్రకృతి విపత్తుల సమయంలో భరోసా ఇవ్వకపోవడం, పంట నష్టం జరిగినప్పుడు పరిహారానికి భరోసా లేకపోవడం వంటి అనేక కారణాలు రైతులను సంక్షోభంతో నెట్టేశాయని అభిప్రాయపడ్డారు. పంట ఏదైనా దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు.మద్దతు ధర అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే ఎలా అని రేవంత్ నిలదీశారు. పత్తికి క్వింటాలుకు రూ.15 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. తక్షణమే రూ.లక్ష రుణమాఫీ చేయాలన్న ఆయన... ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ప్రైవేటు అప్పులను వన్ టైం సెటిల్ మెంట్ కింద పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించి, రైతులకు వర్తించే అన్ని పథకాలను వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. అలాగే పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.