
టీఎస్ పీఎస్స్ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ రివ్యూ మీటింగ్ కు సిట్ అధికారుల్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రితో మాట్లాడించకుండా కేటీఆర్ ఎందుకు చెప్పారని అన్నారు. పేపర్స్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలను కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. సిట్ చెప్పకుండానే ఇద్దరు నిందితులని కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. 9 మందిని అరెస్ట్ చేస్తే ఇద్దరే నిందితులని ఎలా అవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
అసలు పేపర్ లీక్ కి ఐటీ మంత్రికి సంబందం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. ఐటీ మంత్రి రాజీనామా చేయడం వెనుక ఉద్దేశమేంటని అన్నారు. పేపర్ లీక్ కేసులో ఒక నిందితుడు బీజేపీ క్రియాశీలక కార్యకర్త అని ఆరోపించారు. తెలంగాణ మోడల్ అంటే మినిమమ్ గవర్ననెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ అని అన్నారు. దేశంలో పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి పెట్టారని.. ఎగ్జామ్స్ రద్దు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్టానికి బాధ్యాతారహిత నేత సీఎం అయ్యిండని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రజలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక వచ్చిన ప్రతీ నోటిఫికేషన్ లో గందరగోళమేనని రేవంత్ చెప్పారు. 2015 లో సింగరేణి నియామకాల్లో అవకతవకలు, 2016 ఎంసెట్ పరీక్ష పేపర్ లీక్ .. మళ్లీ 2017 లో సింగరేణి నియామకాల్లో ప్రశ్నాపత్రాలు లీక్ ,2019లో ఇంటర్ ఎగ్జామ్ పేపర్స్ దిద్దడంలో లోపభూయిష్టం ఇలా అన్నింట్లో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. ఇంటర్ ఎగ్జామ్ పేపర్ దిద్దడంలో 60 వేల తప్పులు దొర్లాయని ప్రభుత్వమే చెప్పిందని.. దీని వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ వెల్లడించారు.