కుర్రాళ్లలో పంత్‌‌ బెస్ట్‌‌ ఫినిషర్‌‌: పృథ్వీ షా

కుర్రాళ్లలో పంత్‌‌ బెస్ట్‌‌ ఫినిషర్‌‌: పృథ్వీ షా

విశాఖపట్నం: ఏడేళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్‌‌ నాకౌట్‌‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన సహచరుడు రిషబ్‌‌ పంత్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ప్లేయర్‌‌ పృథ్వీ షా ప్రశంసలు కురిపించాడు. టోర్నీలోని కుర్రాళ్లలోకెల్లా పంత్‌‌ బెస్ట్‌‌ ఫినిషర్‌‌ అని వ్యాఖ్యానించాడు. ‘ టీ20ల్లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌లో మా జట్టు విజయం కోసం ప్రార్థించా. ఈ మ్యాచ్‌‌లో పంత్‌‌ బ్రిలియంట్‌‌గా బ్యాటింగ్‌‌ చేశాడు. కుర్ర ప్లేయర్లలోకెల్లా తను బెస్ట్‌‌ ఫినిషర్‌‌ అని చెప్పగలను. మా జట్టుకు అవసరమైనప్పుడల్లా తను ముందుంటాడు. సన్‌‌రైజర్స్‌‌తో మ్యాచ్‌‌లో కీమోపాల్‌‌తో పాటు కలిసి పంత్‌‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పవర్‌‌ప్లేలో పరుగులు చేయడం చాలా కీలకం. భారీ స్కోరు చేస్తే మిగతా బ్యాట్స్‌‌మన్‌‌పై ఒత్తిడి తగ్గుతుంది. వైజాగ్‌‌ పిచ్‌‌పై షాట్లు ఆడటం చాలా కష్టం. బౌలర్లు తెలివిగా బౌల్‌‌ చేస్తుండడంతో ధాటిగా ఆడటానికి వీల్లేకుండా ఉంది. గతి తప్పిన బంతుల కోసం వెయిట్‌‌ చేసి ఫలితం సాధించా. మైదానంలోకి దిగాక మా ప్రణాళికలు చాలా సింపుల్‌‌గా ఉంటాయి. సహజశైలిలో ఆడడంతోపాటు కొందరు బౌలర్లను టార్గెట్‌‌గా చేసుకుని ఆడితే సరిపోతుంది. అయితే ప్రత్యర్థి జట్టులో మహ్మద్‌‌ నబీ, రసీద్‌‌ ఖాన్‌‌లాంటి బెస్ట్‌‌ బౌలర్లు ఉన్నారు. ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌ చాలా ఉత్కంఠగా జరిగింది. అయితే అందులో విజయం సాధించడం ఆనందంగా ఉంది. క్వాలిఫయర్‌‌2లో ఆడే చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌పైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హర్భజన్‌‌ సింగ్‌‌, రవీంద్ర జడేజా, ఇమ్రాన్‌‌ తాహిర్‌‌లాంటి బౌలర్లను ఎలా ఎదర్కోవాలో ఆలోచిస్తున్నాం. గతంలో వారితో ఆడిన మ్యాచ్‌‌లను సమీక్షించాల్సి ఉంది. గతి తప్పిన బంతుల్ని బౌండ్రీకి పంపడానికి సిద్ధంగా ఉంటా.  భజ్జీదా లేదా తాహిర్‌‌ బౌలింగ్‌‌ ఇలా ఎవరు బౌలర్‌‌ అనే దానిపై ఆలోచించను’ అని పృథ్వీ వ్యాఖ్యానించాడు.

మిశ్రా అనుభవన్నంతా రంగరించాడు

ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో వెటరన్‌‌ స్పిన్నర్‌‌ అమిత్‌‌ మిశ్రాపై పృథ్వీ ప్రశంసలు కురిపించాడు. 10–12 ఏళ్లుగా మిశ్రా అంతర్జాతీయ క్రికెట్‌‌ ఆడుతున్నాడని, కీలకసమయంలో జట్టుకు ఉపయుక్తంగా బౌలింగ్‌‌ చేశాడని కొనియాడాడు. మరోవైపు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతుండడంపై మాట్లాడుతూ.. ప్రతీమ్యాచ్‌‌ను ఆసక్తికరంగా మార్చాలనే తాము వికెట్లను కోల్పోతుంటామని చమత్కరించాడు. ఒత్తిడిలో ఆడితేనే మజా వస్తుందని, టీ20ల్లో అదే విశేషమని పేర్కొన్నాడు. మరవైపు గత కొద్ది మ్యాచ్‌‌ల్లో బాగా ఆడకోపోయినా తనపై మేనేజ్‌‌మెంట్‌‌ నమ్మకముంచిదని, ఈ సందర్భంగా యాజమాన్యానికి, సపోర్ట్‌‌స్టాఫ్‌‌కు పృథ్వీ  కృతజ్ఞతలు తెలిపాడు.