ధవన్‌‌కు బ్యాకప్‌‌గా పంత్‌‌ సెలక్ట్

ధవన్‌‌కు బ్యాకప్‌‌గా పంత్‌‌ సెలక్ట్

నాటింగ్‌‌హామ్‌‌:  ప్రపంచకప్‌‌లో ఆడాలన్న యువ వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ కల తిరేలా కనిపిస్తోంది. గాయపడ్డ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌కు బ్యాకప్‌‌గా పంత్‌‌ను సెలెక్ట్‌‌ చేశారు.  ధవన్‌‌ను టీమ్‌‌ నుంచి తప్పించకపోయినా ముందుజాగ్రత్తగా రిషబ్‌‌ను ఇంగ్లండ్‌‌కు పిలిచారు. టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ రిక్వెస్ట్‌‌ మేరకు పంత్‌‌ ఇంగ్లండ్‌‌కు వెళ్తున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మాంచెస్టర్‌‌లో  పాకిస్థాన్‌‌ మ్యాచ్‌‌కు ముందు రిషబ్‌‌ జట్టుతో కలవనున్నాడు. అయితే, మిగతా టోర్నీకి ధవన్‌‌ అందుబాటులో ఉంటాడో లేదో స్పష్టత వచ్చిన తర్వాతనే అతనికి రీప్లేస్‌‌మెంట్‌‌గా పంత్‌‌ టీమ్‌‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ‘2015 వరల్డ్‌‌కప్‌‌లో ధవళ్‌‌ కులకర్ణి మాదిరిగా ప్రస్తుతానికి పంత్‌‌ టీమ్‌‌తో పాటే ఉన్నా.. అధికారికంగా జట్టు సభ్యుడు కాబోడు. మ్యాచ్‌‌ డేస్‌‌లో డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ను పంచుకునేందుకు, టీమ్‌‌ బస్‌‌లో వెళ్లేందుకు అతనికి అనుమతి లేదు.  నెట్‌‌ బౌలర్‌‌ ఖలీల్‌‌ అహ్మద్‌‌తో కలిసి సపరేట్‌‌గా ట్రావెల్‌‌ చేస్తాడ’ని బోర్డు వర్గాలు తెలిపాయి.

10–12 రోజుల తర్వాతే ధవన్‌‌పై నిర్ణయం

శిఖర్‌‌ ధవన్‌‌ టీమ్‌‌కు చాలా విలువైన ఆటగాడని, మిగతా టోర్నీలోఅతను  ఆడేది లేదని పది, పన్నెండు రోజుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని టీమిండియా బ్యాటింగ్‌‌ కోచ్‌‌ సంజయ్‌‌ బంగర్‌‌ తెలిపాడు. ‘ప్రస్తుతానికి ధవన్‌‌ను పరిశీలిస్తున్నాం. 10–12 రోజుల తర్వాతే అతను ఏ స్థితిలో ఉంటాడో తెలుస్తుంది. అప్పుడే అతనిపై ఒక నిర్ణయానికి రాగలం. ఎందుకంటే గాయమైన వెంటనే  ధవన్‌‌ లాంటి విలువైన ఆటగాడి సేవలు మేం కోల్పోలేం’ అని బంగర్‌‌ చెప్పాడు.