ముంబై: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర ఫామ్లో ఉన్నాడు. పటిష్ట ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించిన పంత్.. ఇంగ్లండపై టెస్టు సిరీస్ విక్టరీలోనూ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా టెస్టుల్లో కీలక సమయాల్లో బ్యాటింగ్కు దిగి టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ తన కోసం కాకుండా అందర్నీ ఎంటర్టైన్ చేసేందుకు బ్యాటింగ్ చేస్తున్నాడని పాకిస్థాన్ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ మెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ మీద అతడి టీమ్మేట్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. రిషబ్కు స్వేచ్ఛనిస్తే మరింతగా చెలరేగి ఆడతాడని చెప్పాడు.
‘పంత్ రోజురోజుకూ బాగా మెరుగవుతున్నాడు. అతడు వెనుదిరిగి చూడకూడదు. ఆసీస్, ఇంగ్లండ్ సిరీస్ల్లో అతడు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ఇక అతడ్ని ఆపేదేదీ లేదని నేను అనుకుంటున్నా. పంత్ గేమ్ను ఎంజాయ్ చేస్తూ ఆడతాడు. అతడ్ని అలాగే ఆడనిద్దాం. టీమ్ మేనేజ్మెంట్ కూడా అందుకు సహకరిస్తోంది. స్ట్రోక్ ప్లేయర్లకు హిట్టింగ్ చేసేందుకు లైసెన్స్ ఇవ్వాలి. గేమ్ను పంత్ అర్థం చేసుకొని ఆడుతున్నాడు. అతడికి మరింత స్వేచ్ఛ కావాలి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

