
- ఆన్జో క్యాపిటల్ గ్లోబల్ ఫారెక్స్ లింకుతో గోల్మాల్
- ట్రేడింగ్ చేసిన డబ్బుకు లాభాలు చూపించి టోకరా
- విడతల వారీగా రూ.3.28 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసిన బాధితుడు
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు అందినంతా దోచేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ లాభాలు చూపుతూ ట్యాక్స్లు, కమీషన్ల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. ఇలానే ఆన్జో క్యాపిటల్ గ్లోబల్ ఫారెక్స్ కంపెనీ పేరుతో జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారవేత్త నుంచి రూ.3.28 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది జనవరి 8 నుంచి మే 19 వరకు ట్రేడింగ్లో లాభాలు చూపిస్తూ మోసం చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాద్ జూబ్లీహిల్స్ జూబ్లీ బాల్ పార్క్కు చెందిన ఎల్.శైలేందర్ రెడ్డి(59) వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జనవరిలో ఆన్జో క్యాపిటల్ గ్లోబల్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో తన ఫోనుకు లింక్ వచ్చింది. ఆన్లైన్ ఫారెక్స్లో ట్రేడింగ్ చేసేందుకు లింక్ ఓపెన్ చేశాడు. అందులో పేర్కొన్న అంశాల వారిగా ఇండియన్ కరెన్సీని డాలర్లుగా మార్చి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. జనవరి 8 నుంచి మే 19 వరకు రూ.60 లక్షలు ట్రేడింగ్ చేశాడు.
టైపింగ్ తప్పుతో రూ.8 లక్షలు అదనంగా డిపాజిట్..
శైలేందర్ రెడ్డి ట్రేడింగ్ చేసిన డబ్బుకు వచ్చిన లాభాలు సహా విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సైబర్ నేరగాళ్లు విత్డ్రాకు అనుమతించలేదు. ట్యాక్స్ చెల్లించిన తరువాత విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ట్రేడింగ్ సైట్లో వారు సూచించిన విధంగా మూడు ఇన్స్టాల్ మెంట్లకు గాను మొదటి ఇన్స్టాల్మెంట్ రూ.88,888 చెల్లించాడు. సెకండ్ ఇన్స్టాల్మెంట్కు గాను రూ.88,888 కాకుండా టైపింగ్ తప్పదం వల్ల రూ.8,88,888 డిపాజిట్ చేశాడు. ఇలా తప్పుగా ఎంట్రీ చేసిన డబ్బును కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు.
ఇలా మొత్తం శైలేందర్ ద్వారా డిపాజిట్ అయిన రూ.80 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయాలని సూచించారు. ఈ క్రమంలో లేట్ పేమెంట్ కింద మరో రూ.32 లక్షలు, ఎక్స్చేంజ్ కమీషన్ కింద రూ.35 లక్షలు ఇలా వీఐపీ మెంబర్గా పరిగణిస్తున్నామని నమ్మించారు. ఇలా మొత్తం శైలేందర్ రెడ్డి ట్రేడింగ్ వ్యాలెట్లో 4,80,166 డాలర్లు బ్యాలెన్స్ చూపారు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు.