
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయనకు కలెక్టర్ హనుమంతరావు మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. తర్వాత ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.
డిప్యూటీ సీఎం పీఆర్వోను పరామర్శించిన ఆర్టీఐ కమిషనర్..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యాదగిరిగుట్టలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పీఆర్వో దుడుక రామకృష్ణను ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు కందుల శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు