శబరిమల అయ్యప్ప ఆలయ దర్శనంపై ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరువకూడదని నిర్ణయించింది. అలాగే ఆలయ ఉత్సవాన్ని కూడా రద్దు చేసింది. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం తెరచుకుటుందని ఇటీవల కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆలయ తంత్రి (ప్రధాన పూజారి) కేరళ దేవస్వం మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తో గురువారం చర్చలు జరిపారు. ఈ చర్చలో అయ్యప్ప ఆలయాన్ని ఇప్పుడే తెరవకూడదని నిర్ణయించారు.
ఈ నెల జరగాల్సిన ఆలయ ఉత్సవాలను కూడా వాయిదా వేస్తున్నామని, పూజారులు, బోర్డు సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని సురేంద్రన్ అన్నారు. ఈ నెలంతా గుడి మూసే ఉంటుందని, భక్తులు రావొద్దని సూచించారు.