ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఫైర్

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఫైర్

ఎల్​బీనగర్, వెలుగు: ఎల్​బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కావాలనే అసత్యపు ఆరోపణలు చేయిస్తున్నాడని  బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న సామ జంగారెడ్డి, అతడి కొడుకులు మహేశ్వర రెడ్డి, మధుకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం వనస్థలిపురం ఏసీపీ ఆఫీసులో ఆయన కంప్లయింట్ చేశారు.

అనంతరం సామ రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గత శనివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సర్వే నం. 51 /2 లోని ప్రభుత్వ భూమి కబ్జాకి గురైందని తాను చెప్పామన్నారు. ఆ భూమి కబ్జాలో ఎమ్మెల్యే  ప్రమేయం లేనప్పుడు దాన్ని కాపాడి ప్రభుత్వానికి అప్పజెప్పే బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కబ్జాలపై తాను ఆధారాలతో మీడియా ముందుకు వస్తుంటే ఈ విషయాలను తప్పుదోవ పట్టించేందుకు సుధీర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. తన బంధువులైన కొందరికి రాజకీయ ఆశలు చూపుతూ  వారితో  మీడియా సమావేశం ఏర్పాటు చేయించి తనపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబానికి సంబంధించి థియేటర్ వాటాలో చిన్న వివాదాన్ని ఎమ్మెల్యే రాజకీయంగా ఆయనకు అనుకూలంగా మార్చుకొని తనపై దుష్ప్రచారం చేయిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో సామ ప్రభాకర్ రెడ్డి, నూతి శ్రీనివాస్ రావు, కృష్ణారెడ్డి   తదితరులు పాల్గొన్నారు.