హైదరాబాద్, వెలుగు: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మంగళవారం ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ మగ్ధుంభవన్ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రావు, ఎన్.బాలమల్లేష్, శంకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉన్నవారిని గవర్నర్లుగా నియమిస్తున్నారన్నారు.
గవర్నర్ వ్యవస్థపైన సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 29న ‘సేవ్ ఫెడరలిజం డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. షర్మిల తరహాలోనే ఇతరులు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా గవర్నర్ స్పందించాలన్నారు.