న్యూయార్క్: శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్కు అమెరికా పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది. సముద్రాల్లో కాలుష్యంపై ఆయన చేసిన సైకత శిల్పానికి ఈ అవార్డు వచ్చింది. బోస్టన్లో నిర్వహించిన ‘రెవరే బీచ్ ఇంటర్నేషనల్ స్యాండ్ స్కల్ప్టింగ్ ఫెస్టివల్ 2019’లో 15 మంది టాప్ శాండ్ ఆర్టిస్టులతో పోటీపడి సుదర్శన్ ఈ అవార్డును దక్కించుకున్నారు. “ స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సేవ్ అవర్ ఓషన్” అనే థీమ్తో తాబేలు కడుపులో, చేప కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది.
సముద్రాలను కాపాడాలనే ఉద్దేశం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉందని, అందుకే తనకు చాలా మంది ఓట్లు గెలిపించారని పట్నాయక్ అన్నారు. తనకు ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. “ ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకుంటున్న ఇండియాకు ఈ అవార్డు” అని సుదర్శన్ చెప్పారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సుదర్శన్ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇండియన్ కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి అన్నారు. సుదర్శన్ పట్నాయక్ ఇప్పటికి చాలా సైకత శిల్పాలను రూపొందించారు. పండగలు, ప్రత్యేక రోజుల్లో పూరీ తీరంలో సైకత శిల్పాలు ఏర్పాటుచేసి వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేస్తుంటారు.