అండర్ గ్రౌండ్ లో సినీనటి రాధికా కుమారస్వామి?

అండర్ గ్రౌండ్ లో సినీనటి రాధికా కుమారస్వామి?

బెంగళూరు:  ప్రముఖ కన్నడ సినీనటి రాధికా కుమారస్వామి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిందన్న వదంతులు కన్నడనాట కలకలం రేపుతున్నాయి. కన్నడ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో నటించిన రాధిక తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన మాజీ ప్రధాన తనయుడు దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుండడం శాండిల్ వుడ్.. కన్నడ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమెకు పోలీసులు అరెస్టు చేసిన మోసగాడితో సంబంధాలున్నాయన్న వ్యవహారం సంచలనం రేపింది. ఇవేవీ పట్టించుకోకుండా ఆమె నేరుగా శుక్రవారం రాత్రి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఆర్ఎస్ఎస్ నాయకుడినని.. జ్యోతిష్యుడినని.. ప్రముఖులతో సంబంధాలున్నాయని చెప్పుకుని ఉద్యోగాలిప్పిస్తానంటూ అనేక మందిని మోసం చేసిన 52 ఏళ్ల యువరాజ్ అలియాస్ స్వామితో సంబంధాలపై బలమైన ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించిన నేపధ్యంలో ఆమె విచారణకు హాజరుకావడం హాట్ టాపిక్ అయింది. ఉద్యోగాల పేరుతో అనేక మందిని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన యువరాజ్ రూ.75 లక్షల నగదును రాధికా కుమారస్వామి ఖాతాలో వేసినట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు చెబుతున్నారు. గత డిసెంబర్ 16న యువరాజ్ అలియాస్ స్వామిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో 91 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన 100కు పైగా చెక్కులు దొరికాయి. లాక్ డౌన్ కు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో యువరాజ్ అలియాస్ స్వామి రెండు విడుతలుగా 75 లక్షల రూపాయలు రాధికా కుమారస్వామి ఖాతాలో వేశాడు. మొదటి విడుత 15 లక్షలు వేసి.. రెండో విడుత 60 లక్షలు తన బావమరిది ఖాతా నుండి వేయించాడు. ఈ లావాదేవీల గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించగా.. తాను తీయబోతున్న సినిమాలో తాను ఒక ప్రధానపాత్ర వేయడం కోసం డబ్బిచ్చాడని రాధికా కుమారస్వామి బదులిచ్చారట. అయితే తీయబోయే సినిమాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా అగ్రిమెంట్ లాంటివేవీ చూపించలేదని పోలీసులు అంటున్నారు. స్వామి తనకు 17 ఏళ్లుగా తెలుసునని రాధిక  చెప్పిందట.  జ్యోతిష్యుడిగా తన . కెరీర్.. పెళ్లి.. తన తండ్రి అనారోగ్యం.. చావులతోపాటు అనేక విషయాల్లో ముందే చెప్పడంతో యువరాజు అలియాస్ స్వామిపై తనకు చాలా నమ్మకం, గురి ఉన్నాయని.. అలాంటి వ్యక్తి ఛీటింగ్ కేసులో అరెస్టు కావడం షాక్ గురిచేసినట్లు పోలీసులకు తెలియజేసింది.

మార్చి నుండి నిన్న మొన్నటి వరకు లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఏ సినిమా తీయబోతున్నారన్నది అటు యువరాజ్ అలియాస్ స్వామి గాని.. ఇటు రాధిక గాని నిర్దిష్టంగా చెప్పలేకపోవడంతో విచారణ అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది.  మరోసారి విచారణకు పిలిచినప్పుడు రావాలంటూ ఆమెను బెంగళూరు పోలీసులు పంపించివేశారు. అలాగే తమకు సమాచారం ఇవ్వకుండా బెంగళూరు నగరం దాటి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ఆమె సరేనంటూ వెళ్లినట్లు సమాచారం. పోలీసుల విచారణ నుండి ఇంటికొచ్చిన రాధిక ఆ తర్వాత ఇంట్లో నుంచి గుర్తు తెలియని చోటకు వెళ్లిపోవడంతో ఆమె అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయందని ప్రచారం జరుగుతోంది. పోలీసుల ఆంక్షల నేపధ్యంలో ఆమె బెంగళూరులో సిటీ పరిధిలోనే తన సన్నిహితుల ఇంట్లో తలదాచుకుంటున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు పోలీసులు.. ఇటు రాధికా కుమారస్వామి గాని ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు లేకపోవడంతో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.