సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం(2023 అక్టోబర్ 06) సంచలన తీర్పును వెల్లడించింది. 2022 మే 4వ తేదీ రాత్రి సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి సమీపంలో నాగరాజును అశ్రిన్ సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడి సహాయంతో అత్యంత దారుణంగా హత్య చేశారు. మతాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆశ్రిన్ సోదరుడు ఆమె భర్త నాగరాజును హత్య చేశారని పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే..
2022 జనవరి 31న రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు (25), సయ్యద్ అశ్రిన్ సుల్తానా (23) అనే ఇద్దరు లాల్ దర్వాజలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయంలో సుల్తానా ఇంట్లో తెలియడంతో రెండు నెలల పాటు హైదరాబాద్ను వీడి విశాఖపట్నంలో ఉన్నారు. ఇక తమకేమీ కాదని భావించి... ఐదు రోజుల క్రితమే మళ్లీ హైదరాబాద్కు చేరారు. సరూర్నగర్లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. అయితే సుల్తానా, -నాగరాజుల ఆచూకీ మొత్తానికి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది.
2022 మే 4వ తేదీన సుల్తానా, నాగరాజు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకొచ్చారు. స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో అప్పటికే మాటు వేసి ఉన్న సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు... బైక్పై వారిని వెంబడించారు. నాగరాజుపై గడ్డపారలతో దాడి చేసి హత్య చేశారు.
కళ్లెదుటే భర్తను చంపడంతో సుల్తానా కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.