అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

యాదాద్రి, వెలుగు : అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కోసం మంజూరై ఫండ్స్​ను ఇతర పనుల కోసం మళ్లించొద్దని చెప్పారు. శనివారం యాదాద్రి కలెక్టర్​లో అట్రాసిటీ కేసుల పురోగతిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులతోపాటు ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్​ల్లో ఏ మేరకు లబ్ధిపొందారో పవర్ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా పలు డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు వివరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతాదృక్పథంతో పని చేసి నాయ్యం జరిగేలా చూడాలన్నారు. 

వివిధ శాఖలకు కేటాయించిన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జూలై నుంచి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.  

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్.ఓ.ఆర్) పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో కలెక్టర్​హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష్​ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్​పాల్గొన్నారు.