
బషీర్బాగ్, వెలుగు: డైమండ్ రింగ్ , గోల్డ్ చైన్ గిఫ్ట్ గా పంపిస్తున్నానని నమ్మించి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసాగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళ ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 23న ఫేస్బుక్లో టోనీ విలియం అనే ఐడీ నుంచి ఆమెకు మెసెంజర్ కాల్ వచ్చింది. తనకు లండన్ లో చాలా ఆస్తులున్నాయని, వారసులు ఎవరూ లేరని నమ్మించాడు.
తన ఆస్తి మహిళకు ఇస్తానని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజులు చాటింగ్ చేశాక మహిళకు డైమండ్ రింగ్ , గోల్డ్ చైన్ పార్సిల్ పంపిస్తున్నానని తెలిపాడు. పార్సిల్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుందని, ఐఎంఎఫ్ సర్టిఫికెట్ పొందడానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉందని స్కామర్ తెలియజేశాడు.
నిజమేనని నమ్మిన మహిళ డబ్బులు పంపింంది. మళ్లీ రకరకాల కారణాలతో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.2,02,500 పోగొట్టుకున్నాక ఆమె మోసపోయానని గ్రహించింది. ఆన్లైన్లో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.