ఖమ్మం నుంచే రెండో దశ కంటి వెలుగు : హరీష్ రావు

ఖమ్మం నుంచే  రెండో దశ కంటి వెలుగు : హరీష్ రావు

సీఎం కేసీఆర్ రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు.. జనవరి 18నుండి జూన్ 30 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం కోసం రూ. 100 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలు 100 రోజుల పాటు పని చేస్తాయని వివరించారు. ఖమ్మం జిల్లాకు అదనంగా 35మంది వైద్యులను రిక్రూట్ చేసినట్లు హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే 10లక్షల కళ్ళజోళ్లు ప్రతి జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు.  

ఉదయం 9 నుండి సాయంత్రం 4గంటల వరకు ఐ క్యాంపులు నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.  సోమవారం నుండి శుక్రవారం వరకు వైద్యులు కంటి పరీక్ష చేస్తారని, గ్రామంలోని ప్రతి వ్యక్తికి కంటి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమం తెలంగాణలో తప్ప మరెక్కడ లేదని, టెస్టుల కోసం క్యాంపునకు వచ్చే ప్రజల ఊరు, పేరు, ఫోన్ నంబర్‌‌‌‌ తదితర వివరాలన్నీ నమోదు చేసేందుకు అధికారులు యాప్ రూపొందించారని హరీష్ రావు ప్రకటించారు.