
- ఎదుర్కోలు ఘటాల ఊరేగింపుతో జాతరకు అంకురార్పణ
- ఆభరణాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఘటాల ఊరేగింపుతో లష్కర్ బోనాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటోత్సవ ఎదుర్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలకు అలకరించే ఆభరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంట నగరాల్లో ప్రజల భాగస్వామ్యంతో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, జూన్ 26న గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఘటోత్సవంతో లష్కర్ బోనాల జాతర ప్రారంభమైందన్నారు. నేటి నుంచి సికింద్రాబాద్ 11 ప్రాంతాల్లోని ఆయా వీధుల్లో కొలువైన గ్రామదేవతలకు ఒక్కో రోజు ఘటం తిరిగి రాత్రికి ప్రధాన టెంపుల్కు చేరుకుంటుందన్నారు.
జులై 12 వరకు వివిధ రూపాల్లో అమ్మవారి అలంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత జులై 13న బోనాలు, 14న రంగం ఉంటుందని వెల్లడించారు. అలాగే జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 20న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరుగుతాయన్నారు.
స్టెప్పులేసిన మంత్రి
ఘటోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ మహాకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాత్రి 11 గంటలకు వరకు ఘటాల ఊరేగింపు జరగగా, మంత్రి పొన్నం ప్రభాకర్ పోతరాజులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహం నింపారు. అంతకుముందు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటాలకు ఆభరణాలు అందజేసి, రంగ్రేజ్ బజార్లో తొట్టెల ఊరేగింపు, ఫలహార బండి ఊరేగింపును ప్రారంభించారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎండోమెంట్ కమిషనర్ ఎస్.వెంకటరావు, డీసీపీ రష్మీ పెరుమాళ్,ఈఓ మనోహర్ రెడ్డి, ఆలయ ట్రస్టీ రామేశ్వర్, కామేశ్వర్ ఉన్నారు. కాగా, మహాకాళి ఆలయంలో బోనాల మొదటి రోజు ఆలయాన్ని విద్యా శంకర భారతి సందర్శించి, అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.