ఆర్థర్ యాష్ స్టేడియంలో వందో విక్టరీ
సకారిపై గెలిచి క్వార్టర్స్ చేరిన విలియమ్స్
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ మరో రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ ఓపెన్కు ఆతిథ్యం ఇచ్చే మెయిన్ స్టేడియం.. ప్రతిష్టాత్మక ఆర్థర్ యాష్ స్టేడియంలో విక్టరీల సెంచరీ కొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా నిలిచిన సెరెనా మెగా టోర్నీలో క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్లో మూడో సీడ్ సెరెనా 6–3, 6–7 (6/8), 6–3తో 15వ సీడ్ మరియా సకారి (గ్రీస్)పై గెలిచింది. రెండు వారాల కింద వెస్టర్న్- సదరన్ ఓపెన్లో సకారి చేతిలో ఓటమికి బదులు తీర్చుకున్న అమెరికా లెజెండ్ ఈ స్టేడియంలో తన విక్టరీల రికార్డును 100–13కి పెంచుకుంది. సెరెనా తర్వాత ఈ ఇక్కడ మోస్ట్ విన్స్ రికార్డు స్విస్ లెజెండ్ రోజర్ ఫెడరర్ పేరిట ఉంది. అతను 77 మ్యాచ్ల్లో గెలిచి 11 సార్లు ఓడిపోయాడు. అన్సీడెడ్ పిరంకోవా 6–4, 6–7 (5/7), 6–3తో అలీజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై నెగ్గింది. సెకండ్ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)కు ప్రిక్వార్టర్స్లోనే చుక్కెదురైంది. 16వ సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం) 6–3, 6–3తో కెనిన్కు షాచ్చింది. మరో మ్యాచ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్) 5–7, 6–1, 6–4తో 20వ సీడ్ కరోలినా ముచోవా (చెక్)పై గెలిచి క్వార్టర్స్ చేరింది. మెన్స్ సింగిల్స్లో థీమ్ (ఆస్ట్రియా) 7–6 (7/4), 6–1, 6–1తో అగుర్ (కెనడా)పై, మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–1, 6–1తో తియాఫో (అమెరికా)పై, రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–3, 6–3, 6–3తో బెరెట్టిని (ఇటలీ)పై గెలిచారు.
బోపన్న జోడీ ఔట్
ఇండియా డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న–డెనిస్ షపవలోవ్ (కెనడా) జోడి.. యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో బోపన్న–షపవలోవ్ 5–7, 5–7తో జులియన్ రోజెర్ (డచ్)–హరియా టెకాయ్ (రొమేనియా) చేతిలో ఓడారు. 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా–కెనడా ద్వయం సత్తా మేరకు రాణించలేదు. చెరోసారి సర్వీస్ కోల్పోయిన బోపన్న జంట.. ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ను కాపాడుకోలేకపోయింది.