చదువు చెప్పిస్తామంటూ.. వ్యభిచార కూపంలోకి: ఆరేళ్ల తర్వాత మంచిర్యాల యువతికి విముక్తి

చదువు చెప్పిస్తామంటూ.. వ్యభిచార కూపంలోకి: ఆరేళ్ల తర్వాత మంచిర్యాల యువతికి విముక్తి

తల్లిదండ్రులు కోల్పోయిన అమ్మాయికి అన్నీ తామే అయ్యి చదువు చెప్పించి ప్రయోజకురాలిని చేస్తామని వెంటబెట్టుకుని తీసుకెళ్లిందో మాయ లేడీ. హాస్టల్‌లో ఉంచి మంచీ చెడు చూసుకుంటామని, అమ్మానాన్న లేని లోటు తెలియనీయబోమని చెప్పి అమ్మాయిని అమ్మకానికి పెట్టేసింది. వ్యభిచార కూపంలోకి నెట్టి చేతులు దులుపుకొంది. ఆరేళ్ల తర్వాత ఆ యువతిని పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేశ్య గృహం నుంచి నిన్న రాత్రి విడిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తామంటూ ఓ మహిళ ఆరేళ్ల క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన అమ్మాయిని తన వెంట తీసుకెళ్లింది. మంచిగా భవిష్యత్తుపై ఆశలు కల్పించడంతో ఆ అమ్మాయి ఆమెను నమ్మింది. అయితే ఆ అమ్మాయికి తెలియకుండానే వ్యభిచార గృహ నిర్వాహకులకు అమ్మేసి.. డబ్బుతో ఉండాయించింది. కానీ అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు కొద్ది రోజుల తర్వాత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో అమ్మాయి కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి క్లూ లేకపోవడంతో కేసులు పెద్దగా పురోగతి లేదు. అయితే ఆరేళ్ల తర్వాత ఆ యువతి నిన్న (సోమవారం) ఓ వ్యక్తి ఫోన్ ద్వారా తన మామయ్యకు సమాచారం అందించింది. దీంతో విషయం పోలీసులకు చెప్పడంతో సిరిసిల్లలోని ప్రేమ్ నగర్‌లో ఉన్న వ్యభిచార గృహం నుంచి బాధితురాలిని విడిపించారు. ఆ యువతిని పోలీసులు తన మామయ్యకు అప్పగించారు. హాస్టల్‌లో చేర్పించి చదువు చెప్పిస్తామని చెప్పి తీసుకుని వెళ్లి ఓ మహిళ తనను అమ్మేసిందని బాధిత యువతి చెప్పింది.