- తమను హింసిస్తున్నారని తండ్రికి చెప్పిన పిల్లలు
- విల్లాకు వచ్చిన ప్రియురాలి భర్తపై ఎయిర్గన్తో కాల్పులు
- జరిపిన ప్రియుడు మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో ఘటన
హైదరాబాద్/శామీర్పేట, వెలుగు: వివాహేతర సంబంధం కాల్పులకు దారి తీసింది. కొడుకు, కూతురును చూసేందుకు వచ్చిన తండ్రిపై తల్లి ప్రియుడు ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు. అయితే ఎయిర్గన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్వల్పగాయాలతో బయటపడ్డ ఆ తండ్రి పోలీసులకు కాల్ చేశాడు. ఎయిర్గన్ స్వాధీనం చేసుకున్న శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియుడితోపాటు అతడి ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడు పేరు మనోజ్నాయుడు అని, ప్రియురాలు స్మిత.. ఆమె భర్త సిద్ధార్థ్దాస్గా పోలీసులు తెలిపారు. ఒడిశా బరంపూర్కు చెందిన సిద్ధార్థ్ దాస్ వైజాగ్లోని హిందుజా గ్రూప్ ఆఫ్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాడని బాలానగర్ డీసీపీ సందీప్రావు తెలిపారు.
కుటుంబ కలహాలతో చిచ్చు
సిద్ధార్థ్కు భార్య స్మిత గ్రంధి, కుమారుడు(17), కూతురు(13)ఉన్నారు. స్మిత వైజాగ్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో 2019 నుంచి వేరువేరుగా ఉంటున్నారు. అక్కడే స్మితకు సాఫ్ట్వేర్ ఎంప్లాయి మనోజ్నాయుడుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ప్రారంభించారు. సిద్ధార్థ్కుమారుడు, కూతురు స్మిత వద్దనే ఉండేవారు. ఈ క్రమంలోనే గత మూడేండ్ల క్రితం వీరు హైదరాబాద్ వచ్చారు. సిద్ధార్థ్ వైజాగ్లోనే ఉండిపోయాడు. భార్యాభర్తల మధ్య కోర్టు కేసులు నడుస్తున్నాయి. సిద్ధార్థ్ నుంచి విడిగా ఉంటున్న స్మితతో మనోజ్నాయుడు సహజీవనం చేస్తున్నాడు.
కూతురు, కుమారుడికి చిత్రహింసలు
మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని సెలబ్రిటీ రిసార్ట్లో 21 నంబర్ విల్లాను కొనుగోలు చేశారు. స్మిత, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు. ప్రియురాలు స్మితతో కలిసి తన విల్లాలోనే ఉంటున్న మనోజ్నాయుడు.. ఆమె కుమారుడు, కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్ధార్థ్ దాస్ దృష్టికి తీసుకెళ్లాడు. తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని తండ్రికి తెలియజేశాడు. వేధింపులపై సిద్ధార్థ్ దాస్ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో గత నాలుగు రోజులుగా బాలుడు సీడబ్ల్యూసీ కస్టడీలోనే ఉన్నాడు.
విల్లాకు వచ్చిన సిద్ధార్థ్పై కాల్పులు
సిద్ధార్థ్ కూతురు మాత్రం తల్లితో కలిసి మనోజ్నాయుడు విల్లాలోనే ఉంటోంది. కూతురును కూడా హింసిస్తున్నారని గుర్తించిన సిద్ధార్థ్ శనివారం ఉదయం శామీర్పేట్కు వచ్చాడు. సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాకు వెళ్లాడు. ఆ సమయంలో మనోజ్నాయుడు, స్మితతో పాటు కూతురు కూడా విల్లాలో ఉంది. కూతురును తనతో తీసుకెళ్లేందుకు సిద్ధార్థ్ యత్నించాడు. దీంతో ముగ్గురి మధ్య వివాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఎయిర్గన్తో మనోజ్నాయుడు కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎయిర్గన్ కావడంతో భారీ శబ్ధం తప్ప ప్రాణాపాయం జరగలేదు. సిద్ధార్థ్కి స్వల్పగాయాలయ్యాయి. దీంతో సిద్ధార్థ్ డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చాడు.
మనోజ్, స్మితలకు నేర చరిత్ర
శామీర్పేట్ పోలీసులు మనోజ్నాయుడు, స్మితను అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్తో పాటు స్మిత కూతురు, కుమారుడి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సిద్ధార్థ్ తన పిల్లలను కలుసుకోకూడదని కోర్ట్ ఆర్డర్ ఉన్నట్లు స్మిత పోలీసులకు వెల్లడించింది. తమ వివాదాలు కోర్టుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మనోజ్, స్మితల వివరాలను పోలీసులు సేకరించారు. వీరిద్దరూ మెయిల్స్ హ్యాకింగ్, సోషల్ మీడియాలో యువతను ట్రాప్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. విజయవాడకు చెందిన ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని ట్రాప్ చేసి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరి చీటింగ్ నెట్వర్క్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో సిద్ధార్థ్ కూతురు, కొడుకు ఇచ్చే స్టేట్మెంట్స్ కీలకంగా మారనున్నాయి.