ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి

ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి

ఉత్తరాఖండ్‌ అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక చర్యల కోసం జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నైనిటాల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన అగ్నికీలలు పైన్స్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న హైకోర్టు కాలనీ వరకు వ్యాపించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. 

పైన్స్‌ పమీపంలో ఉన్న పాత, ఖాళీ ఇంటిని మంటలు చుట్టుముట్టాయని ఆ ప్రాంతానికి చెందిన వాసి, హైకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అనిల్‌ జోషి చెప్పారు.దీనివల్ల హైకోర్టు కాలనీకి ఎలాంటి నష్టం జరగలేదు. భవనాల సమీపంలో అగ్నికీలలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. కాగా, పైన్స్‌ సమీపంలో ఉన్న భారత ఆర్మీ స్థావరాలకు కూడా మంటలు చేరువయ్యాయి. వాటిని అదుపు చేయడానికి భారత వైమానిక దళం ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ ద్వారా బాంబి బకెట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. దీనికోసం భీమ్‌ తాల్‌ సరస్సు నుంచి నీటిని తీసుకెళ్లింది.

అగ్ని ప్రమాదం కారణంగా నైనిటాల్‌ జిల్లా యంత్రాంగం నైని సరుస్సులో బోటింగ్‌ను నిషేధించింది. కేంద్ర బలగాలతో కలిసి 40 మంది అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న రుద్రప్రయాగ్‌లో అడవులకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో గత 24 గంటల్లో 31 చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. రాష్ట్రంలో కార్చిచ్చులతో గతేడాది నవంబరు 1 నుంచి ఇప్పటి వరకు 689.89 హెక్టార్లలో అటవీ ప్రాంతం దెబ్బతింది.